కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
దుబ్బాక, అక్టోబర్ 3: బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్పై గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. ఇటీవల దుబ్బాకలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలుపోగుల దండ వేసి స్వాగతం పలికారు.
ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయడంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తల హస్తం ఉందని ఆరోపిస్తూ దుబ్బాకలో పర్యటించిన ఎమ్మెల్యే కాన్వాయ్పై కాంగ్రెస్ కార్యక్తలు దాడికి యత్నించి నిరసన తెలిపారు.
అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్ నాయకులకు చెప్పు చూపిస్తూ ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిరసన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుపార్టీల నాయకులను చెదరగొట్టారు.