కేజ్రీవాల్పై గౌరవంతో పక్కన ఖాళీ కుర్చీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. ఈ దృశ్యాలను ఆప్ నేతలు ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతరం సీఎం ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలోని ఓ సందర్భాన్ని ప్రస్తావించారు. ‘ప్రస్తుతం నాకు భరతుడికి ఎదురైన పరిస్థితే ఎదురైంది. రాముడు అడవికి వెళ్లినప్పుడు భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి ఏలాడు. ఈ కుర్చీ కేజ్రీవాల్ది. త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచి అధికారం చేపడతారని భావిస్తున్నా. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుంది’ అని అతిశీ పేర్కొన్నారు.