calender_icon.png 22 October, 2024 | 12:24 AM

రామాయణమంత రమణీయంగా.. భారతమంత భారీగా...

24-07-2024 12:00:00 AM

రాజ్ తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ప్రకాశ్ రాజ్, మురళి శర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర బృందం అంతా హాజరైన ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ సహా పలువరు అతిథులుగా హాజరయ్యారు. ముందుగా బ్రహ్మానందం మాట్లాడుతూ “చిత్ర దర్శకుడు రామ్ భీమన నాకు కొడుకు లాంటివాడు. మన పురాణాలు, ఇతిహాసల గురించి బాగా తెలుసు.

ఆ నేపథ్యంలో అందమైన పాత్రలు, డైలాగ్స్ రాశారు. సినిమా మంచి విజయం సాధించాలి. ఈ నిర్మాతలు మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు. నిర్మాత డాక్టర్ రమేశ్ తేజావత్ మాట్లాడుతూ “సినిమాల మీద అభిమానంతో పరిశ్రమకి వచ్చి తొలి ప్రయత్నంగా ‘పురుషోత్తముడు’ చిత్రాన్ని నిర్మించాం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది” అన్నారు. రామ్ భీమన మాట్లాడుతూ “దర్శకుడిగా ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలు చేసిన నేను ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ‘పురుషోత్తముడు’. రామాయణం అంత రమణీయంగా భారతం అంత భారీగా సినిమా ఉండాలన్న నిర్మాత మాట మేరకు ఈ సినిమా రూపొందించాను. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. ఈ క్రమంలో సహకరించిన వారందిరికీ కృతజ్ఞతలు” అని తెలిపారు.