calender_icon.png 24 September, 2024 | 11:38 AM

ఆస్పత్రులను పరిశీలించేందుకు వెళ్తే అరెస్టులా!

24-09-2024 03:08:19 AM

 వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వాస్పత్రుల పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడంపై సోమవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆస్పత్రులను పరిశీలిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందన్నారు. నిజంగా ప్రభుత్వం ఏమీ దాచకుంటే నిజ నిర్ధారణ కమిటీని దర్యాప్తు చేయనివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలు పాల్పడినా, ప్రజారోగ్య వవస్థలో లోపాలను ఎత్తి చూపుతామని ఆయన స్పష్టం చేశారు. బస్తీ దవాఖానాలకు సుప్తీ చేసిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే  సంకల్పంతో 400 పైచిలుకు బస్తీ దవాఖానాలను బీఆర్‌ఎస్ సర్కారు ప్రారంభించగా, ఉన్నవాటిని కూడా సరిగ్గా నడపడం కాంగ్రెస్ సర్కారుకు చేతకావడం లేదన్నారు.

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడి అంశంపై ఆమెతో కేటీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి విధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపైన పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.