05-03-2025 01:25:27 AM
కలెక్టర్ హనుమంతరావు వెల్లడి
యాదాద్రి భువనగిరి, మార్చి 4 (విజయ క్రాంతి): నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం రోజు టెలి కాన్ఫరెన్స్ ద్వారా మార్చి5 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని, ఇంటర్ పరీక్షలకు మొత్తం 12,558 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 29 పరీక్షా కేంద్రాలలో, ప్రథమ సంవత్సరం 6208,ద్వితీయ సంవత్సరం 6350 మొత్తం 12,558 విద్యార్ధులు పరీక్షలు వ్రాయనున్నారని, ఇందుకు 29 చీఫ్ సూపరెండెంట్లు,29 శాఖల అధికారులు, ప్లయింగ్ , సిట్టింగ్ స్క్వాడ్స్ లను నియమించడం జరిగిందన్నారు.
పరీక్షలను సజావుగా నిర్వహించేం దుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని , గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సమయానుకూలంగా రవాణా సదుపాయం అందుబాటు లో ఉండేలా బస్సులు నడిపించాలని, నిరంతర విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా చూడాలని నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని, పోస్టల్ అధికారులు ప్రశ్నా పత్రాలను జాగ్రత్తగా తరలించాలని,
పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, సెల్ ఫోన్లు , ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల లో అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష వ్రాసే సమయం లో అరగంట కొకసారి బెల్ మోగుతుందని, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు, పోలీస్ బందోబస్తు, తదితర ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడం ,
ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి , ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను నియమిస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తో అందుబాటులో ఉండాలని, కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావు గా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవం తం చేయాలనీ అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్ధులు ఒత్తిడి కి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని, అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఇంటర్మీడియట్ విద్యాధికారి, రమణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో 52 కేంద్రాలు
నల్లగొండ, మార్చి 4 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బుధవారం ఫస్టియర్ (రెగ్యులర్) 11,706 మంది, ఒకేషన్ 2,286 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా గురువారం ప్రారంభంకానున్న ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 12,389 మంది రెగ్యులర్, 2341 మంది ఒకేషనల్ విద్యార్థులు హాజరుకానున్నారు.
జిల్లా వ్యాప్తంగా 33 మండలాల పరిధిలో 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల కేంద్రాల పరిధిలోని 200 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రంలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉంచునున్నారు. ఇప్పటికే విద్యార్థులందరికీ హాల్ టికెట్ వివరాలు ఎస్ఎంఎస్లు పంపారు.
పరీక్ష కేంద్రాల కచ్చితమైన చిరునామా తెలిసుకునేందుకు హాల్ టికెట్లపై జీపీఎస్ లోకేషన్ ముద్రించారు. దీన్ని స్కాన్ చేసి కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు విద్యార్థులంతా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రూనాయక్ సూచిం చారు. అనివార్య పరిస్థితుల్లో 5 నిమిషాలు ఆలస్యమైనా 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.