24-02-2025 06:56:47 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో స్వయంభుగా వెలసిన కాకతీయుల కాలం నాటి శ్రీ నీలకంఠేశ్వరాలయంలో మహా శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు ఆధ్వర్యంలో సభ్యులు ఇప్పటికే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డిలతో పాటు ప్రముఖులకు సింగరేణి అధికారులకు ఆహ్వాన పత్రికలను అందించారు.
శివపార్వతుల కళ్యాణాన్ని మహాశివరాత్రి రోజున తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం మణుగూరు పాత మల్లేపల్లి వాటర్ ట్యాంక్ వద్ద గోదావరి స్నానాలు చేయుటకు వెళ్ళు భక్తుల సౌకర్యార్థం గోదావరిలో దిగుటకు రోడ్డు, ర్యాంప్ నిర్మాణ పనులను చేపట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ కూచుపూడి వెంకటేశ్వరరావు (బాబు), పాతూరి వెంకన్నలు ఈ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
ఉచిత దర్శనం కల్పించాలి..
మహా శివరాత్రి సందర్భంగా మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వరాలయానికి వచ్చే భక్తులకు ఉచిత దర్శనాన్ని కల్పించాలని కోరుతూ ఆలయ అధికారులకు బిజెపి నాయకులు లింగంపల్లి రమేష్ బిక్షపతి రమేష్ లు సోమవారం వినతిపత్రం అందజేశారు.