10-04-2025 02:18:49 AM
372 కేంద్రాలలో ఐదు కొనుగోలు కేంద్రాలు
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 9 ( విజయ క్రాంతి ): ధాన్యం సేకరణ సజావుగా జరిపేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 372 కేంద్రాలలో 25 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు కూడా మొదలు అయ్యాయి. ఈ పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ధాన్యం సేకరణలో నిమగ్నమయ్యారు.
గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ధాన్యం సేకరణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, కలెక్టరేట్ లోని, జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దానికి గాను ప్రత్యేకంగా ‘ 9281423621 ‘ నెంబర్ కేటాయించి, పిర్యాధుల కోసం కొనుగోలు కేంద్రాల ఏజెన్సీ ల ప్రతినిధులు, పౌర సరఫరాల సిబ్బంది, రవాణా కాంట్రాక్టర్ ల నుండి ఒక ప్రతినిధిని కేటాయించారు.
ఇట్టి కాల్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు, రవాణా, చెల్లింపులు తదితర విషయాలపై ఎలాంటి సందేహాలు మరియు పిర్యాదులు ఉన్న సత్వర పరిష్కారం దొరుకుతుందని జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో బుధవారం నాడు జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత కాల్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమములో జిల్లా మేనేజర్ హరికృష్ణ, సహాయ పౌర సరఫరాల అధికారి రోజా రాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారిణి నీలిమ పాల్గొన్నారు. వీరితోపాటు జిల్లాలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.