calender_icon.png 23 October, 2024 | 1:02 AM

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలి

18-09-2024 08:08:07 PM

సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల నాయకులు అధికారులతో సమావేశం

19న అన్ని మండలాలలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం

విఐపి లు, వీవీఐపీల ఓట్లు మిస్సింగ్ కాకుండా చూడాలి

650 ఓట్లు పైబడిన వార్డులలో రెండో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి

సంగారెడ్డి,(విజయక్రాంతి): రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఓటర్ జాబితా ప్రచురణ పద్ధతి అంశాలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 646 గ్రామ పంచాయతీలో 5720 వార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లు 8,36, 370 మంది ఓటర్లు ఉన్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన లో ఒక కుటుంబానికి సంబంధించిన అన్ని ఓట్లు ఒకే వార్డులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయా గ్రామపంచాయతీ పరిధిలోని విఐపిలు, వీవీఐపీల పేర్లు జాబితాలో మిస్ కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

ఇటీవల ప్రచురించిన ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈనెల 14 నుండి 21 వరకు సంబంధిత ఎంపీడీవోలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంపీడీవోల వద్ద పరిష్కారం కాకుంటే జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అభ్యంతరాలు తెలపాలన్నారు. ఇట్టి అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారి ఈ నెల 26వ తేదీలోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇటీవల ప్రచురించిన ఓటరు జాబితా ప్రచురణ అభ్యంతరాల స్వీకరణ పై అన్ని గ్రామాలలో దండోరా ద్వారా ప్రచారం చేయాలని తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అధికారులు కృషి చేయాలన్నారు.

ఏదైనా వార్డులలో 650 మంది ఓటర్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ఈనెల 19న మండల స్థాయిలో జరిగే రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆయా మండలాల కు చెందిన రాజకీయ పార్టీల నాయకులు అందరూ పాల్గొనేలా అభ్యంతరాలు స్వీకరించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి .సాయి బాబా. వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.