05-03-2025 01:06:31 AM
యాదాద్రి భువనగిరి, మార్చి 4 (విజయక్రాంతి): మార్చి 1 నుండి 11 వరకు వరకు ఎంతో వైభవంగా జరుగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల మంత్రులు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.
మంగళవారం రోజు మినీ మీటింగ్ హాలులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రుల రాక సందర్భంగా జిల్లా కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ ఈ. ఓ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోలీస్ , రెవెన్యూ శాఖ, దేవాదయ శాఖ, ఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్, ట్రాన్స్ పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ, ఎక్సుజ్,వైద్య శాఖ, మిషన్ భగీరథ, ట్రాన్స్ కో, ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలు అధికారులు సంపూర్ణ సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు.
భద్రత ఏర్పాట్లు, శాంతి భద్రతలు, పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను, అగ్నిమాపక పరికరాలను ,సేవలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖను, సిపిఆర్ బృందాలను ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను , శానిటేషన్ పనుల కోసం పంచాయితీ శాఖ, ఈ ఏర్పాట్లన్నీ ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణ రెడ్డి , యాదగిరిగుట్ట ఏసిపి రమేష్, ట్రాఫిక్ ఎసిపి ప్రభాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.