calender_icon.png 18 October, 2024 | 7:46 AM

గ్రూప్ 1 మెయిన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

18-10-2024 02:17:42 AM

  1. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ
  2. పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు
  3. పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ, కలెక్టర్లు, పోలీసులతో సీఎస్ సమీక్ష

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. 

పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సచివాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

సమావేశంలో టీజీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మహేందర్‌రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ నుంచి ముష్రాఫ్ అలీ, రాష్ర్ట కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడు తూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమిషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. 

మధ్యాహ్నం 1.30 తర్వాత నో ఎంట్రీ...

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగుల కు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు.

ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రుబ్) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్‌టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రుబ్ ల సహాయంతో పరీక్షలు రాసేవారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అన్నిపరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్ తెలిపారు.

నిరంతరం విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సీఈలు పర్యవేక్షిస్తారని ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ సీఎస్‌కు తెలిపారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ

టీజీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ ఎం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 2011 తర్వాత రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నా రు. ప్రతీ పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.