09-03-2025 12:44:35 AM
ఏ ప్రజాప్రతినిధికైనా స్థానిక సమస్యలపై సమగ్ర అవగాహన ఉండాలి. ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రాథమిక సమాచారమైనా తెలిసి ఉండాలి.. లేకపోతే ఎప్పటికైనా ప్రజల ముందు నగుబాటుకు గురికాక తప్పదు. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ. మహబూబ్నగర్లో నిర్మించనున్న అమరరాజ లిథియం బ్యాటరీ పరిశ్రమ శంకుస్థాపనకు శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
ఆయనకు పలువురు రాష్ట్ర మంత్రు లు, ఎంపీలు ఘనస్వాగతం పలికారు. అనంత రం వారిలో కొందరు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. దీనిలో భాగంగానే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, రైల్వే డివిజన్ కూడా కేటాయించాలని ఎంపీ కావ్య, మంత్రి సీతక్క వినతిపత్రం అందజేశారు. ఇదే అంశంపై సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రెస్మీట్ పెట్టారు.
‘కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విషయం మీకు తెలియదా? అవసరమైతే మేం వందేభారత్లో మిమ్మల్ని తీసుకెళ్తాం. కోచ్ఫ్యాక్టరీ పనులను చూపిస్తాం. ఇంత చిన్న విషయం తెలియకపోతే ఎలా’ అంటూ ఎంపీ కడియం కావ్య, మంత్రి సీతక్కకు చురకలంటించారు.
పెద్ది విజయభాస్కర్