calender_icon.png 13 February, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న భక్తులకు సాంకేతిక సేవలు కలేనా?

13-02-2025 12:00:00 AM

  • సత్వర సేవలు అందక భక్తుల పాట్లు
  • ఆన్‌లైన్ సేవలకు ఎదురుచూపులు 

చేర్యాల, ఫిబ్రవరి 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న ఆలయానికి ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. రాష్ట్రం నలుములలనుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఏటా సుమారు 15 లక్షలు నుండి 20 లక్షల వరకు స్వామివారిని దర్శించుకుంటారు. ఎంతో మహిమగల్ల దేవుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి ప్రాశస్త్రం ఉన్న దేవాలయానికి ఎటువంటి సాంకేతిక హంగులు కనిపించకపోవడం గమనర్హం.

ఏడాది మొత్తంలో ప్రత్యేక దర్శనాల ద్వారా, వేలం పాటలు ద్వారా, హూండిల ద్వారా, ఆర్జిత సేవలతో పాటు వివిధ రూపాల్లో సుమారు రూ.18 కోట్లు మల్లన్న ఖజానాకు వచ్చి చేరుతుంది. ఆమ్దానిలో డిసి( డిస్టిక్ కమిషనర్ ) కేటగిరీలో ఉన్న దేవాలయం భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆ స్థాయి సేవలు అందుబాటులో లేవన్న విమర్శలు లేకపోలేదు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజన్న,  భద్రాచలం సీతారామ దేవాలయలలు లేటెస్ట్  టెక్నాలజీ  అందిపుచ్చుకోవడానికి ఎప్పుడు ముందుంటున్నాయి.

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ భక్తులకు సత్వర సేవలను అందిస్తున్నాయి. మల్లన్న క్షేత్రంలో ఏ విభాగంలోనూ సాంకేతిక టెక్నాలజీ మచ్చుకైనా కానరావడం  లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్వర సేవలు అందక భక్తులు  బాధలు వర్ణానాతితం. ఇప్పటికే గతేడాది కంటే ఈ సంవత్సరం మూడు వారాల్లోని ఆదాయం సుమారు రూ.40 లక్షలు తగ్గినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సంవత్సరం పూర్తయ్యే వరకు కోటి వరకు తగ్గొచ్చని పలువురు విశ్లెషిస్తున్నారు.

 ఇంకా పాతకాలం లోలగా  మానవ వనరుల మీదనే ఆధారపడి సేవలను కొనసాగిస్తున్నారు. సాధారణ రోజులలో భక్తుల రద్దీ తక్కువగానే ఉన్నప్పటికీ, బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే ప్రతి ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇది యే గాక ప్రత్యేక రోజులైనా మల్లన్న కళ్యాణం, బ్రహ్మోత్సవాలలో భాగంగా  మొదటి,రెండు ఆదివారాలు, శివరాత్రి రోజు పెద్దపట్నం, తర్వాత వచ్చే అగ్నిగుండాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.

స్వామి వారి దర్శనం కోసం క్యు లైన్లో గంటల కొద్ది నిరీక్షిస్తుంటారు. ఒక్కొక్కసారి స్వామి వారి దర్శనం ఐదారు  గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ లలో బారులను చూసి భక్తులు స్వామివారిని  దర్శనం చేసుకోకుండానే, గంగిరేణి చెట్టు  వద్ద స్వామి వారి మొక్కుల అప్పజెప్పి వెను తిరుగుతుంటారు. భక్తుల రద్దీ  సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో  అందుబాటులో ఉంటే భక్తులు తమ వీలును బట్టి స్వామివారిని దర్శనం చేసుకుంటారు.

అదేగాక ఆర్జిత సేవలు, అభిషేకాలు, కళ్యాణం లాంటీ సేవలను సమాచారాన్ని ఆన్లైన్ సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తే, భక్తులకు సమయం కలిసి రావడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఆలయానికి ఆదాయం కూడా పెరుగుతుంది.   అదేవిధంగా దేవాలయ ఆధ్వర్యంలో ఉండే వసతి గృహాల సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తేవాలని భక్తులు ఆకాక్షిస్తున్నారు.

భక్తులు ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుసుకుని తమకు అనుకూలమైన సమయంలో దేవాలయ పరిధిలో అందించే సేవలను’ మీ సేవ’ ద్వారా బుక్ చేసుకొని, ఆ సమయానికి స్వామివారి దర్శనానికి భక్తులు వచ్చి, దర్శనం చేసుకొని వెళ్తారు.

స్వామివారి సన్నిధిలో భక్తులకు అందించే సేవలను ఆలయ ప్రధాన కూడళ్ల వద్ద డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి, సేవల వివరాలను డిస్ప్లే చేస్తే, భక్తులకు మేలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్వామి వారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో క్యూ లైన్ లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో డిజిటల్ బోర్డ్ ద్వారా సమాచారం అందివ్వాలని భక్తులు కోరుతున్నారు.

డిజిటల్ సేవలు ద్వారా అవినీతికి అడ్డుకట్ట 

మల్లన్న క్షేత్రంలో డిజిటల్ సేవలు కూడా అందుబాటులో లేవని చెప్పాలి. ఈ సిస్టం ద్వారా  అవినీతికి, అవతవకలకు ఆస్కారం ఉండదు ఇటీవల భద్రాచలం సీతారామ ఆలయంలో డిజిటల్ సేవలు అమలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ డిజిటల్ సేవలు అన్నదానం, విఐపిల ప్రోటోకాల్ దర్శనం, స్వామివారికి వచ్చే వస్త్రలకు తదితర వాటిల్లో డిజిటల్ సేవలు అమలు చేయవచ్చు. దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్లో ఫోటో దిగి, కార్యాలయంలో ఫోటో చూపించి అన్నదాన టోకెన్ పొందవచ్చు.

అదేవిధంగా విఐపిలకు సంబంధించి ప్రోటోకాల్  దర్శనం కోసం డిజిటల్ సేవలు ద్వారా వారి పేర్లు, వివరాలు నమోదు చేయించుకొని,దేవస్థానం వారు ఇచ్చే పాసుల ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి, ఎల్లమ్మ తల్లికి సమర్పించే వస్త్రాలకు బార్కోడు ద్వారా రికనైజ్డ్ చేసి డిజిటలైజేషన్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా అవినీతి అక్రమాలకు చెక్ పెట్టవచ్చు.తద్వారా ఆలయం కు ఆదాయం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది.

ఆలయంలో ఆన్లైన్ సేవలను, డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలని భక్తులు  కోరుతున్నారు. ఆన్లైన్, డిజిటల్ సేవలు అమలవుతున్న ఆలయాలను సందర్శించి, ఆలంబిస్తున్న టెక్నాలజీని అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు . 

సంవత్సరం క్రితం కారుణ్య నియామకాల్లో నియమింపబడ్డ ఉద్యోగి పూర్వాశ్రమంలో సాఫ్ట్వేర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అతని సేవలు వినియోగించుకుంటూ మరికొంతమందిని ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి, ఆన్లైన్ సేవలకు వినియోగించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.