28-03-2025 01:39:06 AM
రుణం రణం
గతంలో 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 2014 నాటికి మొత్తం రూ.90,160 కోట్లు అయితే, పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు 1.12.2023 నాటికి రూ. 6,69,257 కోట్లు. ఇదికాకుండా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బకాయిలు కలిపితే మరో రూ. 40 వేల 154 కోట్ల పేమెంట్స్ పెండింగ్లో పెట్టారు. ఇవన్నీ కలిపితే వాళ్లు పదేళ్లలో చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు. వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలి.
ప్రాణహితేొచేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో రూ. 36 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్ష కోట్లకు అంచనా పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 2 వేల కోట్ల బిల్లు లు చెల్లించారు. మీ అవినీతిపై కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో పెడుతాం. మూసీ, మెట్రో రైలు, ఆర్ఆర్ఆర్ నిర్మించాలా? వద్దా? అభివృద్ధ్ది చేయవద్దా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వాళ్లు మాకు అప్పగించిన అప్పు రూ.8,19,151 కోట్లు
అసలు, మిత్తికి మేం కట్టింది రూ.1,53,359 కోట్లు
మేం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే
పదేళ్లలో వారి రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమే
పది నెలల్లో మేం చేసింది రూ.20,617 కోట్లు
నేను కక్ష సాధించాలనుకుంటే చర్లపల్లి జైల్లో ఉండేవారు
శాసనసభలో కేటీఆర్కు సీఎం రేవంత్రెడ్డి కౌంటర్
హైదరాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2014 వరకు నాలుగేళ్లల్లో చేసిన రుణమాఫీ రూ.16,143 కోట్లు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లలో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు మాత్రమే అన్నారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదని, కానీ చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ. 11,909 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, మొత్తంగా పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమే అన్నారు. వీళ్లు మమ్మల్ని రుణమాఫీ చేయలేదని అడుగుతున్నారన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల్లో 25,35,964 మంది రైతులకు రూ. 20,616.89 కోట్లు మాఫీ చేశామని చెప్పారు. వాళ్లు ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు తాము చెల్లించామన్నారు. రూ.4666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించామని, రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచామని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్ హౌస్లో పండిన వడ్లను క్వింటాల్ రూ.4500 చొప్పున కావేరి సీడ్స్కు అమ్ముకున్నారని విమర్శించారు. కానీ తాము రూ.11 వేల 61 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇచ్చామని తెలిపారు.
ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్..
ఉచిత కరెంట్కు కాంగ్రెస్ పేటెంటని, కరెం ట్ అంటేనే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నా రు. 29,14,692 మంది రైతులకు ఉచిత కరెంట్కు రూ.15,332 కోట్లు వెచ్చించినట్లు తెలి పారు. రైతు బీమాను కొనసాగించామని, వారు పదేళ్లు చేయలేనివి మేం పదినెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కళ్లల్లో నిప్పు లు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అభినందించకపోయినా ఫరవాలేదు.. ప్రభుత్వాన్నైనా అభినందించవచ్చు కదా అన్నారు. సభకు వచ్చి కేసీఆర్ సలహాలు సూచనలు ఇస్తే తాము తీసుకుంటామని, వారి గౌరవానికి ఎలాంటి భంగం రాదన్నారు.
16 మంది సీఎంల కంటే కేసీఆర్ చేసిన అప్పే ఎక్కువ..
16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 2014 నాటికి మొత్తం అప్పు రూ.90,160 కోట్లు అయితే, పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు 1.12.2023 నాటికి రూ. 6,69,257 కోట్లు చేశారన్నారు. ఇది కాకుండా ఉద్యోగులు, కాం ట్రాక్టర్ల బకాయిలు కలిపి మరో రూ.40 వేల 154 కోట్లు పేమెంట్స్ పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఇవన్నీ కలిపితే వాళ్లు పదేళ్లలో చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు అని పేర్కొన్నారు. ఇక వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలని కేటీఆర్కు సీఎం ప్రశ్నించారు. పదేళ్లలో ఒక పార్టీ, ఒక కుటుం బం చేసిన అప్పు రూ.8.19 లక్షల కోట్లన్నారు.
మేం వచ్చిన పదిహేను నెలల్లో చేసిన అప్పు రూ.1,58,041 కోట్లు అని, అయితే ఇందులో డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన అసలు మొత్తం రూ. 88,591 కోట్లు, డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 64,768 కోట్లు అన్నారు. పదేళ్లలో వాళ్లు చేసి న అప్పులకు అసలు, వడ్డీ కలిపి తాము తిరిగి చెల్లించిన మొత్తం రూ. 1,53,359 కోట్లు అన్నారు. వాళ్లు చేసిన అప్పులకు చెల్లించినవి పోగా 15 నెలల్లో తమ ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే అన్నారు.
డాక్టర్లు, ఇంజినీర్లు అంతా వాళ్లే..
2017లో వేసిన నోటిఫికేషన్లకు కూడా ఉద్యోగ నియామకాలను గత ప్రభుత్వం చేపట్టలేకపోయిందని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించిందన్నారు. వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15 నెలల్లోనే 57,946 ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం చెప్పారు. అక్రమసంపద ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. వారు చేసిన అప్పులు తప్పులకు తెలంగాణ శిక్ష అనుభవిస్తుందన్నారు.
అప్పు లు చేసి కట్టిన కూలేశ్వరం ఏమైందో తెలిసిందేనని, దాంట్లో నీళ్లు నింపి కూలిపోతే రాజకీ యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు అంతా వాళ్లేనని కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రాజెక్టు సరిగా నిర్మించలేదని, తుమ్మడి హట్టి వద్ద కట్టకుండా ఇష్టానుసారంగా నిర్మించారని రిటైర్డ్ ఇంజినీర్లే చెబుతున్నారన్నారు. ఎన్డీఎస్ఏ కూడా అదే సూచించిందని తెలిపారు.
‘బీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే.. పొద్దునలేస్తే అబద్ధాలతో బతకాలనే ఆలోచనతో ఉన్నారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగ ర్, కొండపోచమ్మ సాగర్కు కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకోలేదు. శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుల నుంచి నీళ్లతోనే పంటలు పండాయి. మీ లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు గుండు సున్నా.
మీ ప్రతిపాదిత ప్రాజెక్టుల వద్దనే మీకు ఫామ్హౌస్లు నిర్మించుకున్నారు. లగచర్ల భూ సేకరణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘాట్ భూ సేకరణ విషయం లో అక్కడి ప్రజలు, రైతులను పోలీసు బూట్ల తో తొక్కించారు. మేం అప్పుడు ధర్నా చేసింది భూ సేకరణకు వ్యతిరేకంగా కాదు.. భూ నిర్వాసితులకు పరిహారం పెంచాలని ధర్నా చేశాం. మేం కొట్లాడటం వల్లే పరిహారం పెంచారు.
కొండపోచమ్మ నుంచి మీ ఫామ్హౌష్కు నీళ్లు తీసుకెళ్లింది నిజం కాదా? దీనిపై విచారణకు సిద్ధ్దమని చెప్పండి.. నిజ నిర్దారణ కమిటీ వేద్దాం. ఆ కమిటీలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐ ఎం, సీపీఐ సభ్యులనే సభ్యులుగా నియమి ద్దాం, ఫామ్హౌస్ చుట్టూ కాలువలు తీసుకెళ్లారు. ఆధారాలు చూపాలా? లగచర్లలో భూ సేకరణ జరగకుండా, మీరు అధికారాలను చం పండి అని మీ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి చెప్పింది నిజం కాదా? అధికారులను చంపాలని ప్రోత్సహించిన మీరు భూ సేకరణపై మాట్లాడుతారా? అని సీఎం ఫైర్ అయ్యారు.
ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడితే గొప్పకాదు..
నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడటం గొప్పతనం కాదు. చైనా, జపాన్, జర్మనీ వాళ్లకు ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. నేను మీలాగా పూణే.. అమెరికాకు వెళ్లలేదు. హోటల్లో ఆర్డర్ తీసుకునేందుకు, రిసెప్షనిస్టుగా పని చేసేందుకు ఇంగ్లీష్ అవసరం. నేను ప్రభత్వ పాఠశాలలో చదువుకుని ఇక్కడి వరకు వచ్చాను’ అని సీఎం తెలిపారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగింది.. కమిషన్ నివేదిక సభలో పెడుతాం..
‘ప్రాణహిత ప్రాజెక్టును రీ డిజైన్పేరుతో రూ. 36 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్ష కోట్లకు అంచనా పెంచారు. మీరు దిగిపోయే నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 1 లక్షా 2 వేల కోట్ల బిల్లులు చెల్లించారు. మీరు అవినీతికి పాల్పపడ్డార ని కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ను సభలో పెడుతాం. బలవంతంగా భూములు గుంజుకున్నది మీరు.
తెలంగా ణ జాతిపితా అని చెబుతున్న కేసీఆర్ను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు. నేను పోతూ నిన్నూ తీసుకుపోతా అని చెప్పి ఓడగొట్టాను. మూసీ ప్రాజెక్టు, మెట్రో రైలు, రీజినల్ రింగ్రోడ్డు నిర్మించాలా? వద్దా? అభివృద్ధ్ది చేయవద్దా చెప్పండి’ అని సీఎం నిలదీశారు.
కుర్చీ కోసం పెద్దాయనను ఖతం చేయాలని చూడొద్దు..
‘ముఖ్యమంత్రిగా నేను ఇక్కడికి వస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మీకు అంత కడుపు మంట ఎందుకు. మేం వచ్చే ఐదేళ్లు ఇక్కడే ఉంటాం.. మీరు అక్కడనే ఉం టారు. కేసీఆర్ ఇక్కడికి రావడం లేదు. మీకు ఆ పెద్దాయన కుర్చీ ఇవ్వడు. ఆ కుర్చీ మీద ఆశపెట్టుకుని.. ఆయన్ను ఖతంచేసి కుర్చీలో కూర్చోవాలని చూడొద్దు.
నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబం మొత్తాన్ని ఏకే 47తో కాల్చిచంపాడట. ఆ పరిస్థితి తెలంగాణకు రావద్దు. పాపం పెద్దాయనను ఉండనీయండి. ఆయ న మీద పగ పెంచుకోవద్దు. మీ తెలివితేటలు తెలంగాణ అభివృద్ధ్ది కోసం ఉపయో గించండి’ అని కేటీఆర్నుద్దేశించి సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
16 రోజులు కక్షకట్టి జైల్లో పెట్టారు!
‘నాపై కక్షకట్టి జైల్లో పెట్టారు. నక్సల్స్, ఐఎస్ఐ తీవ్రవాదులుండే డిటెన్షన్ సెల్లో పెట్టారు. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. లైట్లు ఆన్లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు. వాళ్ల అప్పులకు, తప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లయితే.. పది నెలల్లో మేం చేసింది రూ.20,617 కోట్లు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
తమపై ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని కేటీఆర్ చేసిన ఆరోపణపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే వాళ్ల కుంటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేదని, ఇక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదని మండిపడ్డారు.
చంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారని, వారిలాగా తాము కక్షసాధింపు చర్యలకు వెళ్లలేదన్నారు. డ్రోన్ ఎగిరేస్తే రూ.500 ఫైన్ వేసి, స్టేషన్ బెయి ల్ ఇచ్చి పంపిస్తారని, కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న తనను జైల్లో పెట్టారన్నారు. 16 రోజులు తనను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా నిర్బంధించినా ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప.. కక్ష సాధింపునకు పాల్పడలేదని చెప్పారు.
కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తనను బంధించారన్నా రు. చివరకు ‘చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశా రు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు.. అంతకుఅంత అనుభవిస్తారనుకుని ఊరుకున్నానన్నారు.