calender_icon.png 22 September, 2024 | 10:07 AM

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎప్‌సెట్, జేఈఈ కోచింగ్

07-09-2024 01:25:18 AM

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2024 విద్యాసంవత్సరానికి గానూ ఎప్‌సెట్, నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈమేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రవేశ పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయిలో విద్యార్థులకు శిక్షణిస్తే బాగా రాణిస్తారనే ఆలోచనతో  ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకనుగుణంగా అధికారులు ప్రణాళికలు రచించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఇంటర్ విద్యా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు నాగరాజు  హర్షం వ్యక్తం చేశారు.

ఇంటర్ విద్యలో అకాడమిక్ గైడెన్స్ సెల్...

ఇంటర్ విద్యలో అకాడమిక్ గైడెన్స్ సెల్ ఏర్పాటుకు అనుమతులిస్తూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు పూర్తి సమాచారమిచ్చేలా ఈ సెల్ దిశానిర్ధేశం చేయనుంది. పరీక్షల సన్నద్ధత, కాలేజీల సమాచారం, పైచదువులకు సంబంధించి  మార్గదర్శకత్వం చేయనుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఐఐటీ, సీఏ, పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నారు.

వీటితోపాటు అధ్యాపకులు, సిబ్బంది, అధికారులు, విద్యార్థుల బయోమెట్రిక్ అటెండెన్స్‌ను గైడెన్స్ సెల్ పర్యవేక్షించనుంది. ఇదిలా ఉంటే జూనియర్ కాలేజీల లెక్చరర్లు, గ్రంథపాలకు లు, ఫిజికల్ డైరెక్టర్లకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రమోషన్స్ కల్పిస్తూ కళాశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.