25-03-2025 01:18:23 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 24 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీతోపాటు సుజాతనగర్ మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీలు కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రెవేశపెట్టిన బిల్లుకు సోమవారం ఆమోదం లభించింది.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈమేరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. కార్పొరేషన్ ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలపడంతో కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కకు, జిల్లా ఇంచార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటిల్కు కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీ ఆమోదం లభించడంతో గవర్నర్ ఆమోదంతో త్వరలో గెజిట్ విడుదల కానుంది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే కార్పోరేషన్ ఏర్పాటు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసి సాధించానని, కొద్ది రోజుల్లోనే కొత్తగూడెం ప్రాంతం నగరాలకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో అబివృద్ది సాధిస్తుందని తెలిపారు. కార్పోరేషన్ ఏర్పాటు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రజల ఆస్తులకు సరైన విలువ పెరుగుతుందన్నారు.
ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ది సాధిస్తున్న కొత్తగూడెం ప్రాంతం మరిన్ని పరిశ్రమల ఏర్పాటు దారులు ఏర్పడతాయని తద్వారా ఉద్యోగ, ఉపాది అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జిల్లాలో విస్తారంగా ఉన్న బొగ్గు, విద్యుత్, అటవీ, ఖనిజ సంపద ఆదారిత పరిశ్రమల ఏర్పాటు వేగవంతం కానుంద న్నారు.
ఎప్పటినుంచో నిలిచిపోయిన పాల్వంచ ఎన్నికలకు అడ్డంకులు తొలిగిపోయాయని తెలిపారు. గెలిసిన 15 నెలల కాలంలోనే కార్పొరేషన్ సాధించి నియోజకవర్గ ప్రజలకు గెలుపు ఫలాలు అందించడం పట్ల అన్నివర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కార్పొరేషన్ ఏర్పాటుకు నిరంతరం కృషి చేసిన శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావుకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా కృతజ్ఞతలు తెలిపారు.