calender_icon.png 8 September, 2024 | 8:43 AM

ఐఫోన్ ధరలు తగ్గించిన యాపిల్

27-07-2024 01:30:56 AM

ముంబై : ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుఖవార్త. యాపిల్  కంపెనీ తన ఐఫోన్  ధరలను తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని విని యోగదారులకు యాపిల్ బదిలీ చేసింది. దీంతో ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. యాపిల్ తాజా నిర్ణయంతో ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేలు మేర తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ రూ.3 వేలు వరకు తగ్గడం గమనార్హం. ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను యాపిల్ తన వెబ్‌సైట్‌ల్లో అప్‌డేట్ చేసింది.

సాధారణంగా యాపిల్ కొత్త మోడళ్లు లాంచ్ చేసినప్పుడు మాత్రమే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తూ ఉంటుంది. కానీ, యాపిల్ తొలిసారి ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలను తగ్గించడం గమనార్హం. బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణం. సాధారణంగా దేశీయంగా దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లకు 20 శాతం కస్టమ్స్ డ్యూటీ, 2 శాతం సర్ఛార్జి (22%) వర్తిస్తుంది. తాజాగా కస్టమ్స్ సుంకం తగ్గించాక బేసిక్ కస్టమ్ డ్యూటీ 15 శాతం, 1.5 శాతం సర్ఛార్జి కలిపి 16.5 శాతానికి చేరింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనం గా చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ ప్రస్తుతం 13, 14, 15 బేసిక్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తుండగా.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను దిగుమతి చేస్తోం ది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఆ మేర ధరలు తగ్గాయి. దేశీయంగా తయారైన ఫోన్లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో తగ్గింపు స్వల్పంగానే ఉంది.