- ఓటు నమోదుకు అభ్యర్థుల తంటాలు
- క్యాంపులతో అవగాహన
- అంతంతమాత్రంగా స్పందన
- మిగిలింది తొమ్మిది రోజులే
కరీంనగర్, అక్టోబర్ 2౮ (విజయక్రాంతి): కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం (కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్) పట్టభద్రుల ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి అనుకున్నంత స్పందన లభించడం లేదు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలవాలనుకుంటున్న నాయకులు ఎన్రోల్మెంట్పై ప్రత్యేక క్యాంపులను, బృందాలను ఏర్పాటు చేసి సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికి యువత నుంచి స్పందన కనిపించడం లేదు. పట్టభద్రులు చాలామంది ఓటు నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 15 జిల్లాలు, మొత్తం 271 మండలాలు ఉండగా, ఇప్పటివరకు 1,45,748 మంది ఎన్రోల్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆన్లైన్ ద్వారా 1,45,236 కాగా ఆఫ్లైన్లో 512 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 41,863 ఆన్లైన్ దరఖాస్తులు, 213 దరఖాస్తులను ధ్రువీకరించారు.
ఆన్లైన్లో 1,849 రిజక్ట్ కాగా, ఆఫ్లైన్లో 7 దరఖాస్తులు రిజక్ట్ అయ్యాయి. ఆన్లైన్లో ఇంకా 1,11,524 దరఖాస్తులు, ఆఫ్లైన్లో 294, మొత్తం 1,11,818 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 15,699 దరఖాస్తులు స్పష్టంగా లేకపోవడం, 74,888 దరఖాస్తులు బూత్ లెవల్ అధికారుల పరిధిలో, ఏఈఆర్వో పరిధిలో 16,522, ఈఆర్వో పరిధిలో 4709 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
అత్యధికంగా కరీంనగర్లో..
ఓటరు నమోదులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 39,455 దరఖాస్తులను స్వీకరించారు. తర్వాతి స్థానం జగిత్యాల 15,727, సిద్దిపేట 12,970, మంచిర్యాలలో 12,588 దరఖాస్తులు స్వీకరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఉమ్మడి జిల్లాలో 1,97,000 మంది ఓటర్లు ఎన్రోల్ చేసుకోగా, లక్షా 9 వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈసారి ఎన్రోల్మెంట్ పెరిగినా అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. నవంబర్ 6 తో ఓటరు నమోదు ప్రక్రియ ముగియనుండగా పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్న నాయకులు వేగం పెంచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
జిల్లాల వారీగా ధ్రువీకరించిన దరఖాస్తులు
ఉమ్మడి ౪ జిల్లాల్లో ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాలు ఉండగా, ఇప్పటి వరకు ఆన్లైన్లో 231, ఆఫ్లైన్లో 8, మంచిర్యాల జిల్లాలో 12 మండలాల్లో ఆన్లైన్లో 4,315, ఆఫ్లైన్లో ఒకటి, ఆదిలాబాద్లో ఆన్లైన్లో 278, ఆఫ్లైన్లో 22, నిర్మల్ జిల్లాలో ఆన్లైన్లో 3,738, ఆఫ్లైన్లో 39 దరఖాస్తులను ధ్రువీకరించారు.
నిజామాబాద్లో ఆన్లైన్లో 447, ఆఫ్లైన్లో 20, కామారెడ్డిలో ఆన్లైన్లో 354, ఆఫ్లైన్లో 2 దరఖాస్తులను ధ్రువీకరించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో జగిత్యాల జిల్లాలో ఆన్లైన్లో 3,382, ఆఫ్లైన్లో 6, పెద్దపల్లిలో ఆన్లైన్లో 2,025, ఆఫ్లైన్లో ఒకటి, కరీంనగర్ జిల్లాలో ఆన్లైన్లో 6,555 ఆఫ్లైన్లో 33, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్లో 5,135, ఆఫ్లైన్లో 3 దరఖాస్తులను ధ్రువీకరించారు.
మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలో సంగారెడ్డిలో ఆన్లైన్లో 1,270, ఆఫ్లైన్లో ఐదు, మెదక్ జిల్లాలో ఆన్లైన్లో 1,787, ఆఫ్లైన్లో 43, సిద్ధిపేట జిల్లాలో ఆన్లైన్లో 2,252, ఆఫ్లైన్లో 19 దరఖాస్తులను అధికారులు ధ్రువీకరించారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండి..
ప్రస్తుతం హనుమకొండలో ఉన్న నాలుగు మండలాల్లో ఆన్లైన్లో 92, ఆఫ్లైన్లో 5, గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిసిన మండలాల్లో ఆన్లైన్లో రెండు, ఆఫ్లైన్లో ౪ దరఖాస్తులను ధ్రువీకరించినట్టు అధికారులు తెలిపారు. మొత్తంగా 41,863 ఆన్లైన్ దరఖాస్తులను, 213 ఆఫ్లైన్ దరఖాస్తులను ధ్రువీకరించారు.