హైదరాబాద్: కొరిగ్రాఫర్ జానీ మాస్టర్ జాతీయ అవార్డును సస్పెండ్ చేసినందున అతని మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అక్టోబరు 8న ఉత్తమ కొరియోగ్రఫీ జాతీయ అవార్డును అందుకోవాల్సిన నేపథ్యంలో జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తిరుచిత్రంబళం (2022) చిత్రానికి గానూ జానీ మాస్టర్ని ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు గ్రహీతగా ప్రకటించారు.
అయితే, పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డుల జ్యూరీ జానీ మాస్టర్ అవార్డును సస్పెండ్ చేసింది. దీంతో అనుకున్న స్థాయిలో అవార్డు అందుకోలేక పోతున్నాడు. దీంతో ఆయన బెయిల్ను రద్దు చేసేందుకు పోలీసులు ఇప్పుడు కోర్టు అనుమతిని కోరుతున్నారు. చట్టపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ను అక్టోబర్ 10న రంగారెడ్డి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. తమ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే జానీ మాస్టర్ పై తదుపరి చర్యలు తీసుకోవచ్చని పోలీసు అనుకుంటున్నారు.
జానీ మాస్టర్పై 21 ఏళ్ల కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు కారణంగా కొన్ని వారాల క్రితం అరెస్ట్ అయ్యారు. తాను మైనర్గా ఉన్న సమయంతో సహా గత కొన్నేళ్లుగా అతను తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.