04-03-2025 01:07:48 AM
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలు మహమూద్అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరిన యెగ్గె మల్లేశం, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హాసన్ పదవీకాలం ఈ నెల 29తో ముగియనున్నది.
ఈ ఐదుగురి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కిం పు ప్రక్రియ కూడా జరగనున్నది.
ప్రస్తుతం శాసనసభలో ఆయా పార్టీలకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. దీంతో టికెట్ కోసం రెండు పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయం కానున్న నేపథ్యంలో టికెట్ దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరా? అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయం లో పార్టీ అధిష్ఠానంతో చర్చించే అవకా శం ఉంది. మరోవైపు తమకున్న సంఖ్యాబలం రీత్యా ఒక అభ్యర్థిని గెలిపించుకోగల బీఆర్ఎస్.. రెండో అభ్యర్థిని సైతం బరిలోకి దిం పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అధికార కాంగ్రెస్పార్టీలోని ఆశావహులు జోరుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వివిధ సందర్భాల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ లభించిన నాయకు లు ఈసారి ఎమ్మెల్సీ సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.