అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రం ‘పుష్ప -2’. డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్, సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఈ సినిమాను నవీన్ ఎర్నేని. వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రబృందం గురువారం హైదరాబాద్లో ప్రెస్మీట్ను ఏర్పాటు చేసింది. సమావేశంలో ఈ సినిమాను ఇండియా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న నిర్మాతలు కూడా పాల్గొన్నారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. “పుష్ప-2’ను మేము ఇంతకు ముందు చెప్పిన దాని కన్నా ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం” అన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, “మా అందరి ముందు పెద్ద గోల్స్ ఉన్నాయి. సినిమా వర్క్ అంతా బాగా జరుగుతుంది.” అని తెలిపారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లా డుతూ, “నైజాంలో మేము ఈ సినిమా విడుదల చేస్తున్నాం.
ఈ ఏరియాలో సినిమా పెద్ద నంబర్ని అచీవ్ చేస్తుంది” అన్నారు. హిందీకి సంబంధించి ఏఏ సినిమాస్, అనిల్ తడాని మాట్లాడుతూ, “పుష్ప -2ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప పార్ట్ 1 కూడా రిలీజ్ చేశాం” అని తెలిపారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ మాట్లాడుతూ.. “మా జిల్లాలో డే 1 షేరే కాకుండా టోటల్ బిజినెస్ కూడా ఆల్ టైం రికార్డ్ అవుతుందని కోరుకుంటున్నా” అన్నారు.
తమిళ్ ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి మాట్లాడుతూ, “పుష్ప ఒక బ్రాండ్గా మారింది. అన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం” అని తెలిపారు. మలయాళ ఈ4 ఎంటర్టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూటర్ ముకేశ్ మెహతా మాట్లాడుతూ, “పుష్ప -2తో మేము 12 కోట్ల మార్క్ని టచ్ చేయాలని అనుకుంటున్నాం.
లియో కలెక్ట్ చేసిన నంబర్ అది” అని తెలిపారు. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. “కర్ణాటకలో ఒక సినిమా చేసిన అత్యధిక బిజినెస్ రూ.90-95 కోట్లు. కర్ణాటకలో అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చూస్తాం. దాదాపు 500 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసి నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తాం” అన్నారు.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లేదు..
పుష్ప 2లో ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన ప్రెస్మీట్లో ఈ విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా దీనికి నిర్మాత నవీన్ ఎర్నేని సమాధానమిచ్చారు. జానీ మాస్టర్తో ఏ పాటనూ చేయించడం లేదని.. ఇప్పటికే ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తయిందన్నారు.