calender_icon.png 11 October, 2024 | 4:59 AM

మంత్రి సురేఖపై మరో కేసు

11-10-2024 03:00:00 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పరువు నష్టం దావా  

విచారణ 14కు వాయిదా  

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరపున న్యాయవాది ఉమామహేశ్వరరావు దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే  మంత్రి సురేఖ మాట్లాడిన ఆడియో, వీడియో టేపులతో పాటు 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు. బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. 

గతంలోనే లీగల్ నోటీసులు

తనపై మంత్రి  సురేఖ చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్‌తో పాటు నాగచైతన్య, సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవప్రతిష్టలకు భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొ న్నారు.

మంత్రి హోదాను సురేఖ దుర్వినియోగం చేశారన్నారు. గతంలో ఇవే అడ్డగో లు మాటలు మాట్లాడిన సురేఖకు ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశా రు.

భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక, చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చ రించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని కేటీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

నాగార్జున పిటిషన్‌పై వివరణ ఇవ్వండి

  1. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
  2. విచారణ 23కు వాయిదా

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు గురువారం నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

అక్కినేని కుటుంబంతో పాటు కుమారుడు నాగచైతన్య- నటి సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న మొదట నాగార్జున స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్న కోర్టు, నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావాలోని అనేక అంశాలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరా రు. ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. మొదట సుప్రియ వాగ్మూలం తీసుకున్న న్యాయస్థానం గురువారం రెండో సాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలం తీసుకున్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.