24-04-2025 07:33:59 PM
కలెక్టరేట్ ఎదుట ధర్నా..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ధారా స్నేహ బిందు మాట్లాడుతూ... ఎండల తీవ్రతకు అంగన్వాడీ కేంద్రంలో చంటి పిల్లలు తట్టుకోలేక పోతున్నారని, వడదెబ్బ వల్ల పసిపిల్లలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ కే. వీర బ్రహ్మచారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కుమ్మరి కుంట్ల నాగన్న, అధ్యక్షులు సంపూర్ణ, నాయకులు కవిత, వీరలక్ష్మి, ఆండాలు, మల్లికాంబ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.