25-03-2025 11:59:49 PM
ఆరిజోనా: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడుకు చెందిన కొల్లి అభిషేక్ (34), అరవింద్ అనే అన్నాదమ్ములు పదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. వారిద్దరూ ఆరిజోనాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది అభిషేక్కు వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ ఆరిజోనాలోనే ఉంటున్నారు. వచ్చే జీతం సరిపోకపోవడంతో అభిషేక్ ఆరు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అభిషేక్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య అక్కడి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆరిజోనాలోని ఓ ప్రాంతంలో అభిషేక్ మృతదేహాన్ని గుర్తించారు. అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అభిషేక్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.