11-02-2025 12:59:57 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
సోమవారం సీఎం తన నివాసంలో గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చూడాలన్నారు.
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. అధికారులు ఇసుక రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నియామక బాధ్యతలను జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించాలన్నారు.
అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటు వేస్తామని సీఎం హెచ్చరించారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు ఇసుక నిర్వహణ బాధ్యతలను అప్పగిం చాలని సీఎం సూచించారు.
నేరుగా వినియోగదారుడికి..
ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలన్నారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను సూచించిన సీఎం.. ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా మార్పుచేయాలని స్పష్టంచేశారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటుచేయాల్సిందిగా సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరాలని, ఆ విధంగా వ్యవస్థను తయారుచే యాలన్నారు. ఏరియాలవారీగా సమీప ఇసుక రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా చూడాలన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.