calender_icon.png 9 October, 2024 | 7:53 AM

చెరువుల లెక్క తేల్చేందుకు కసరత్తు

09-10-2024 01:57:08 AM

సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయనున్న హైడ్రా 

ఆ సంస్థ ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నగరంలోని చెరువులను గుర్తించేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. గతంలో నగరంలో ఎన్ని చెరువులు ఉండే వి.. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయనే లెక్క తేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పనిచే యనుంది.

మంగళవారం హబ్సీగూడలోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి హైడ్రా బృందంతో కలిసి కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన పాత మ్యాప్‌ల ను రంగనాథ్ పరిశీలించారు.

1971 సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి.. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది.. నాలాలు ఎంత విస్తీర్ణం లో ఉండేవి అని పరిశీలించారు. దశాబ్దాల క్రితం నాటి మ్యాప్‌లతో నేటి పరిస్థితిని సరిపోల్చుతూ చెరువులు, నాలాల వివరాలను సర్వేఆఫ్ ఇండియా అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

ఇప్పటికే హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ నుంచి సేకరించిన చెరువుల జాబితాతో పాటు సర్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి చెరువులు, నాలాల పరిస్థితి, కనుమరుగైన చెరువులపై అవగాహన కల్పించారు. 

సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను నిర్ధారించడంలో సర్వే ఆఫ్ ఇండియాను కూడా భాగస్వామ్యం చేయబోతున్నట్లు తెలిపారు. అధికారులు అందించిన వివ రాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయబోతున్నట్లు కమిషనర్ వివరించారు.

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించి, తదుపరి చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాధాన్య క్రమంలో చెరువులను ఒకదాని తర్వాత ఒకటిగా పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు చేపడుతుందని వెల్లడించారు.