calender_icon.png 25 October, 2024 | 9:48 AM

భూసమస్యపై వీడని గ్రహణం

12-08-2024 02:12:42 AM

  1. ఏళ్లుగా మగ్గుతున్న ఖాల్సా ఎక్సెస్ ల్యాండ్ సమస్య 
  2. సర్వే నెం.1146 బాధితులు 120 మంది 
  3. రెవెన్యూ కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం  ఖాల్సాలోని సర్వే నెం.1,146లో 135.26 ఎకరాల అసైన్డ్ భూమి సమస్య ఏళ్ల తరబడి మగ్గుతోంది. దశాబ్దాలుగా ప్పరిగూడ, శేరిగూడ గ్రామాలకు చెందిన 120 మంది రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వీరికి నాటి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు, పాత పాస్‌పుస్తకాలు ఇచ్చింది.. కానీ ధరణి పోర్టల్ వచ్చాక జారీ అయిన పాస్ పుస్తకాలు కొత్త సమస్యను తీసుకొచ్చాయి.

నాడు రెవెన్యూ అధికారులు ఉన్న భూమి కంటే అదనంగా పత్రాలు ఇవ్వడంతో సమస్య తలెత్తింది. ఎక్సెస్ ల్యాండ్ కారణం చూపుతూ రెవెన్యూ అధికారులు రైతులను ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తున్నారు. కానీ ఇదే సర్వే నెంబర్‌లో కొందరు రైతులకు డిజిటల్ సైన్ చేసి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వడం గమనార్హం. కొందరి దరఖాస్తులకు పరిష్కారం చూప డం వెనుక ఉన్న మతలబు ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. చేయి తడిపితే తప్ప రెవెన్యూ అధికారులు ఫైల్ ముందుకు కదపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే సమస్యను పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

చక్రం తిప్పుతున్న ఆర్‌ఐ..

రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ధరణికి దరఖాస్తు చేసుకోగా ఓ ఆర్‌ఐ కొన్నింటినీ మాత్రమే పరిష్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అన్ని తానై వ్యవహరిస్తున్నారని తెలిసింది. తహసీల్దార్ దర ఖాస్తులను పరి ష్కరించాలని సూచించినా, ఏదో ఒక సాకు తో ఆర్‌ఐ ఫైల్  ముందుకు కదలకుండా జాప్యం చేస్తున్నారని, లేదా తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

సమస్యను పరిష్కరిస్తాం

ఇబ్రహీంపట్నం ఖాల్సా సర్వే నెం.1146 లో 20 ఎకరాలు ల్యాండ్ ఎక్సెస్ ఉన్న కారణంగా ధరణి దరఖాస్తులను పరిష్కరించడం లేదు. ఆ సమస్యను ఆర్‌ఐ లెవల్ చేస్తే తప్ప చేయడానికి కుదరదు. ఇదే సర్వే నెంబర్ల్ కొన్ని నెలల క్రితం కొందరి దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. కానీ నేను బాధ్యతలు తీసుకోకముందే వాటికి పరిష్కారం లభించింది. భూసమస్యలపై త్వరలోనే రైతులతో సమావేశమై పరిష్కరిస్తాం.

 సునిత, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం

రైతులకు న్యాయం చేయాలి

ధరణి పాసుపుస్తకాలు అందకపోవడంతో వారు రైతు సంబంధిత పథకాలకు అనర్హులవుతున్నా రు. ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నారు. పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా ఫలితం లేకపోయింది. చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదు. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. సమగ్ర విచారణ జరిపించి రైతులందరికీ న్యాయం చేయాలి.

 బి.సామేల్, ఇబ్రహీంపట్నం