calender_icon.png 24 October, 2024 | 4:59 AM

ఈడీ ఉచ్చులో అమోయ్

24-10-2024 02:28:48 AM

  1. తెరపైకి నాగారంలోని భూదాన్ భూ బాగోతం 
  2. ఈడీ విచారణకు హాజరు 
  3. 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ
  4. రూ. వందల కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా బదిలీ చేశారని ఆయనపై అభియోగాలు

హైదరాబాద్ సిటీబ్యూరో/రంగారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తున్నది. నాగారంలోని భూదాన్ భూముల బదిలీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో అమోయ్‌కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. 

బుధవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణ నిమిత్తం అమోయ్‌కుమార్ తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 6 గంటల వరకు  కొనసాగింది. సుమారు 8 గంటలపాటు అమోయ్‌ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది.

కాగా, అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీల్లో అక్రమాలు జరిగాయని, వందల కోట్ల రూపాయల విలువైన 42 ఎకరాల భూమిని అక్రమంగా బదిలీ చేశారనే అభియోగాల నేపథ్యంలో ఆయన పాత్రపై ఈడీ సుదీర్ఘ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గానూ పనిచేసిన అమోయ్‌కుమార్ ప్రస్తుతం పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 

నాగారం భూమి కథ ఇదీ..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182 లోని 102.2 ఎకరాల భూమిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. అయితే ఇం దులో 42 ఎకరాల భూమి భూదా న్ బోర్డుకు చెందినదని బోర్డు వాదిస్తోంది. కాగా, ఈ భూమి జబ్బర్దస్త ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది. తరువాత కాలంలో జబ్బర్దస్త ఖాన్ కొడుకు హజీఖాన్ అందులోని 42ఎకరాల ల్యాండ్‌ను భూదాన్ బోర్డుకు దానం చేశారు.

అయితే 2021లో హజీఖాన్ వారసురాలినంటూ 42 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా అనే మహిళ దరఖాస్తు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో ఆర్డీవో, తహశీల్దార్, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఆమెకి అనుకూలంగా పని చేసినట్లు విచారణలో బయటపడింది. అనంతరం ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకాలు చేసినట్లు విచారణలో తేలింది.

ఎన్నికల సమయంలో ఈ భూమికి సంబంధించి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ భూమిపై క్రయవిక్రయాలు జరగకుండా అధికారులు ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ వ్యవహారం కాస్త కోర్టుకు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో అప్పటి ఎమ్మార్వో జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులో భారీస్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో మొదట విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. భూ బదిలీల అంశంలో ప్రస్తుతం ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పాత్రపై విచారణ కొనసాగుతోంది.

దీంతో పాటు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పింగ్లిపురం గ్రామంలో సర్వే నంబరు 76లో కొంత ప్రభుత్వ అసైన్డ్ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టినట్లు అమోయ్‌కుమార్‌పై ఫిర్యాదులు అందినట్లు సమాచారం.