calender_icon.png 22 October, 2024 | 4:10 PM

అమెరికావన్నీ అబద్ధాలే

21-10-2024 12:00:00 AM

వికాస్ తల్లి ఆరోపణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు రా మాజీ అధికారి వికాస్ యాదవ్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ద్ధాలేనని వికాస్ తల్లి సుధేశ్‌యాదవ్ అన్నారు. మాతృదేశం కోసం వికాస్ పనిచేస్తున్నాడని ఆమె తెలిపింది. కుట్రపై అమెరికా నిజాలు చెప్పడం లేదన్నారు.

తమ దేశంలో ఉంటున్న టెర్రరిస్ట్ పన్నూను చంపడానికి వికా స్ ప్రయత్నం చేశాడని అమెరికా న్యాయశాఖ  కేసు నమోదు చేయడంతో మోస్ట్‌వాంటెడ్‌లో ఎఫ్‌బీఐ చేర్చింది. అంతకుముందే వికాస్‌ను ఉద్యోగం నుంచి తీసేశామని అమెరికాకు భారత్ తెలిపింది. వికాస్ భారత్‌లోనే రహస్యంగా ఉంటున్నాడని అగ్రరాజ్యం అనుమానిస్తోంది.

మరోవైపు 2023లో వికాస్ తనపై దాడి చేశాడని ఓ వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా మార్చిలో అతనికి బెయిల్ వచ్చిందని తెలిపింది. ఉగ్రవాది పన్నూ హత్యకు తాను కుట్ర పన్నినట్లు మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని తమతో వికాస్ ఆవేదన వ్యక్తం చేశాడని అతని బంధువులు తెలిపారు.