calender_icon.png 19 October, 2024 | 2:09 PM

ఆ 28 సీట్లపై సందిగ్ధత

19-10-2024 02:16:31 AM

ముంబై, అక్టోబర్ 18: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 22న ఎన్నికల నగా రా మోగనున్న నేపథ్యంలో సీట్ షేరింగ్‌పై కూటమిలోని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) సమావేశంలో మొత్తం 288 సీట్ల కు గాను 260 స్థానాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 28 స్థానాలపై 3 పార్టీల్లో సందిగ్ధత నెలకొంది.

ఈ సీట్లలో తామే పోటీ చేయాలని అ న్ని పక్షాలు భావించడం వల్లనే వీటిపై ప్రతిష్టంభన ఏర్పడింది. వీటిపై మరిన్ని చర్చలు జరిగే అవకాశముందని, అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని భావిస్తున్నట్లు చర్చల్లో పా ల్గొన్న కూటమి నేత ఒకరు వెల్లడించారు. ఒక పరిష్కారానికి వచ్చేందుకు కొద్దిగా సమయం పడుతుందని, అందరూ సంతృప్తి చెందితేనే మంచి విజయం సాధించగలమని చెప్పారు. 

ఎవరి లెక్కలు వారివి..

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిలో మంచి పనితీరు కనబరిచిన నేపథ్యంలో 110 నుంచి 115 సీట్లను కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన 86, ఎన్సీపీ 75 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎన్సీపీ తమకు అనుకూలమైన పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టింది. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఈ బెల్ట్‌లో గరిష్ఠ స్థానాలు గెలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ 28 సీట్లపై సందిగ్ధం నెలకొన్నట్లు తెలుస్తోంది.

ముంబై, కొంకణ్ ప్రాంతాల్లో బలంగా ఉన్న శివసేన ఎక్కువ సీట్ల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. విదర్భలో బలమైన ప్రదర్శన చేస్తామని, ఈ మేరకు ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ సీట్లపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే బుధవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు 60 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ కూడా 12 సీట్లు డిమాండ్ చేస్తుండటం కూటమికి పెద్ద సవాలుగా మారింది.