యాచారం మండలంలోని మాల్ పట్టణంలో ఘటన
దళిత, ప్రజా సంఘాల నాయకుల ఆందోళన
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17 : యాచారం మండలంలోని మాల్ పట్టణంలో గుర్తుతెలియని దుండగులు.. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం రాత్రి రంగువేశారు. ఈ విషయాన్ని బుధవారం తెల్లవారుజామున గుర్తించిన దళిత, ప్రజా సంఘాల నాయకులు విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు.
నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేసీపీ రాజు విగ్రహాన్ని పరిశీలించారు. పరిస్థితి అదుపుతప్పకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం, సీసీ కెమోరాలతో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.