14-04-2025 07:31:56 PM
నివాళులర్పించిన చీఫ్ ఇంజనీర్ ప్రభాకర రావు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6 దశల్లో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర రావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ సాధారణ దళిత కుటుంబంలో జన్మించి కులవివక్షను, అంటరాని తనాన్ని భరించి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అత్యున్నత స్థాయికి ఎదిగి కుల నిర్మూలన, అంటరానితనం, అవిద్య మొదలగు సామాజిక రుగ్మతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు.
ఎంతో ముందు చూపుతో భారత రాజ్యాంగాన్ని రూప కల్పన చేసిన గొప్ప దార్షనికుడన్నారు. ఆయన జీవితాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకొని, కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధిలో భాగ స్వాములవ్వటమే గాక సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారికి మన వంతు సాయం అందించాలని, అదే మనం అంబేద్కర్ కి ఇచ్చే ఘన నివాళి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎస్సీలు శ్రీనివాస్, S. సునీల్ రాందాస్ వెంకటేశ్వర్లు, వెల్ఫేర్ ఆఫీసర్ భాగం. రాధా కృష్ణ ఇంజనీర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులు ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు, ఆర్టిజన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.