14-04-2025 05:55:15 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లె నుండి మొదలుకొని పట్టణం వరకు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారి, డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ప్రోత్సాహక నగదు చెక్కులను అందజేశారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేసముద్రం పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎస్సై మురళీధర్ రాజ్ తదితరులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.