18-04-2025 08:39:16 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): నస్పూర్ కృష్ణ కాలనీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1998 నుంచి 2007 వరకు (పది సంవత్సరాలలో) చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పది బ్యాచ్ల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.
పదేళ్ల తమ పాఠశాల జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. విద్యార్థులు ఉత్సాహంగా చేసిన నృత్యాలు, ఆలపించిన పాటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఆచార్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలు సంస్కృతికి నిలయాలని, ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు సమాజంలో, ప్రపంచంలో భారత సంస్కృతిని కాపాడటానికి ముందుంటారని తెలిపారు.