calender_icon.png 10 October, 2024 | 12:50 PM

హైడ్రాకు పోలీసుల కేటాయింపు

11-09-2024 02:52:13 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : గ్రేటర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీసులను కేటాయించింది. ఈ మేరకు హైడ్రాకు వివిధ జోన్లలో పనిచేస్తున్న 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 8 మంది ఎస్‌ఐలను డిప్యూటేషన్‌పై కేటాయిస్తూ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

హైడ్రాను అడ్డుకున్న ముగ్గురిపై కేసు 

మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో ఈనెల 7వ తేదీన తమ ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారంటూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన వారిపై మాదాపూర్ పోలీసులు మంగళవానం కేసు నమోదు చేశారు. హైడ్రా అధికారులు సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమణలను తొలగిస్తున్న క్రమంలో వెంకటేశ్, అతని భార్య లక్ష్మి, తమ్ముడు సురేష్ తదితరులు హైడ్రా సిబ్బందిని అడ్డుకుని.. కూల్చివేతలు చేపడితే ఆత్మహత్య చేసుకుంటామంటూ పెట్రోల్ పోసుకుని హల్‌చల్ చేశారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.