బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని 8వ వార్డులో తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని జంగపల్లి శంకరమ్మ అనే మహిళ ఆరోపణలు చేస్తున్నారు.ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ కౌన్సిలర్ జిలకర వాసు తెలిపారు. గురువారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. తనపై రాజకీయంగా బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారన్నారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎక్కడ గుంట జాగ కూడా కబ్జా చేయలేదన్నారు. 30 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన తన ఇంటి స్థలంలోని కొద్ది భాగాన్ని శంకరమ్మ ఇంట్లో శుభకార్యాల కోసం వాడుకొని ఇప్పుడు తమ భూమిగా చెప్పుకుంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని అన్నారు. తన స్థలం విషయం బస్తీ పెద్దలకు తెలుసని, దీనిపై విచారించి తన స్థలాన్ని అప్పగించేలా చూడాలని ఆయన కోరారు.