20-03-2025 12:33:41 AM
ఎల్బీనగర్, మార్చి 20 ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిపై ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లకు బీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆలేటి రంగేశ్వరి మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు లోకాయపారి ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కలెక్షన్ కింగ్లుగా మారాని ఆరోపించారు.
ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఇన్చార్జి మధుయాష్కీగౌడ్ చేతిలో బీజేపీ కార్పొరేటర్లు కీలుబొమ్మలు మారారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై బురద జల్లడమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
గెలిచినప్పటి నుంచి ఒక్క పని కూడా సొంతంగా చేయించలేని వెన్నెముక లేని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రజల దృష్టి మరల్చడానికి ఎమ్మెల్యేపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.సిద్ధాంతపరంగా పూర్తి వైరుధ్యాలున్న బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెట్టాపట్టాలు వేసుకోవడంలోని మతలబు ఏమిటని? ప్రశ్నించారు.
ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవమున్న సుధీర్రెడ్డిపై అనవసరపు ఆరోపణలు చేస్తే తామేదో పెద్దవాళ్లము అయిపోతామనుకోవడం బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల అవగాహన లేమికి నిదర్శనమన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసమే ఎమ్మెల్యేపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాసేవన మరచిపోయిన బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కలెక్షన్ కింగ్లుగా మారి, తమ డివిజన్లలో ఎక్కడ కొత్తగా ఇల్లు నిర్మించాలన్నా డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కార్పొరేటర్ల చేయి తడపనిదే ఇటుక పెట్టే పరిస్థితి లేదన్నారు. శిఖర సమానులైన సుధీర్రెడ్డిపై అనవసరపు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ప్రజల చేతిలో ఛీత్కారానికి గురికాక తప్పదని రంగేశ్వరి హెచ్చరించారు.