calender_icon.png 21 October, 2024 | 1:04 PM

సుట్టూ ఒళ్లంతా సలి మంటలే.. దిండ్లు దుప్పట్లు సరిపోతలే..

30-07-2024 12:05:00 AM

ప్రేమలో పడగానే అనంతమైన భావాలతో మనసులు బరువవుతాయ్.. మాటలు కరువవుతాయ్. మన సినిమాల్లోని పాత్రధారులు సైతం ప్రేమలో పడగానే అప్పటికప్పుడు కవులుగా మారిపోవడం, కవితాత్మకమైన పాటలు పాడుకోవడం వంటివి చేస్తుంటారు. భావావేశానికి లోబడి ప్రేక్షకులుగా మనం చూస్తుం టాం. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలు, ఆ సినిమాల్లోని పాత్రలు వీటికి కాస్త దూరమని చెప్పవ చ్చు. ‘ఇడియట్’ సినిమాలోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ మొదలుకొని ఈ తరహా పాట లు ఆయన చిత్రాల్లో వింటూ, చూస్తూనే ఉన్నాం.

కాగా రామ్ పోతినేని, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా ఆయన తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం నుంచి తాజాగా మూడో పాట విడుదలైంది. ‘క్యాలప్డా’ పేరిట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ పాటలో ఆ శైలిని గమనించవచ్చు. “నరం నరం గరం గరం.. పదింటికే చలిజ్వరం, నీ ఊహలే నిరంతరం.. పోతోందిరా నాలో షరం” అని కథానాయిక అంటుంటే.. “సుట్టూ ఒళ్లంతా సలి మంటలే.. దిండ్లు దుప్పట్లు సరిపోతలే, మందు కొడుతున్నా మత్తొస్తలే.. కోళ్లు కూస్తున్నా నిదరొస్తలే” అంటాడు  ప్రేమ మైకంలో ఉన్న కథానాయకుడు. శ్రీ హర్ష ఈమాని రాసిన ఈ రొమాంటిక్ గీతానికి ధనుంజయ్ సీపాన, సింధూజ శ్రీనివాస్ గాత్రమందించారు. శోభి మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మణిశర్మ స్వరాలందించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.