calender_icon.png 20 September, 2024 | 3:17 AM

నకిలీ డాక్టర్ ను వెంటనే శిక్షించాలి

19-09-2024 07:04:56 PM

న్యూ లైఫ్ ప్రైవేటు ఆర్ఎంపి ఆసుపత్రి ముందు అఖిలపక్ష నేతల ధర్నా..

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ముందు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన న్యూ లైఫ్ ఆసుపత్రి నిర్వాహకుడు నకిలీ వైద్యుడు మహమ్మద్ శమిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు ఆర్ఎంపి ఆసుపత్రి ముందు గురువారం ధర్నా చేపట్టారు. తన వద్దకు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తాడూరు మండలంలోని యాత్మతపూర్ గ్రామానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో బాధితురాలికి మద్దతుగా రెడ్డి మహిళ సంఘం నేతలు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలంతా ధర్నాలో పాల్గొన్నారు. ఎలాంటి అర్హత లేకపోయినా ఆసుపత్రి గోడలపై వైద్యులుగా చలామణి అవుతూ అమాయకులను వంచనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్నారని అమాయక మహిళలను వారి శరీరాలతో దందాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ్ల వాతావరణం నెలకొంది.