calender_icon.png 22 October, 2024 | 5:38 AM

ఆదాయానికి మద్యమే దిక్కు

22-10-2024 01:40:18 AM

  1. మిగతా అన్నింటిలో ఆదాయం తగ్గింది 
  2. మాజీ ఎంపీ బీ వినోద్  

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రానికి మద్యం ఆదాయం మినహా అన్నింటిలో తగ్గిందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. ఆదాయం తగ్గుదల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి లోతుగా సమీక్షలు చేయడం లేదని పేర్కొన్నారు.

సోమవారం తెలంగాణ భవన్‌లో పల్లె రవికుమార్, రాజారాం యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక అంశాలపై  సచివాలయంలో సమీక్ష చేసినపుడు ఓ రకంగా ఐఎస్‌బీ కార్యక్రమంలో మరో రకంగా సీఎం మా ట్లాడటం సరికాదన్నారు. హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడిందని విమర్శించారు.

కరోనా తర్వాత కేసీఆర్ పాలనలో ఆర్థికంగా రాష్టం వీ షేప్ లో కోలుకుందని, రేవంత్ పాలనలో జీరో షేప్‌గా మారిందన్నారు. తెలంగాణ జీఎస్‌డీపీని వన్ ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామని రేవంత్ పదేపదే అంటున్నారని, ముంబై మహానగరం ఎకానమీ 300 బిలియన్ డాలర్లే ఉండగా.. హైదరాబాద్ ఎకానమీని 600 బిలియన్ల డాలర్లకు చేరుస్తానని పేర్కొ నడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

లక్ష కోట్లలోపే ఖర్చు చేసి కాళేశ్వరంతో కేసీఆర్ లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని, రేవంత్ ముప్పు కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు. జీవో 29పై సుప్రీంకోర్టు బంతిని హైకోర్టుకు చేర్చిందని, రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి రాజ్యాంగ స్ఫూర్తి కొరవడిందన్నారు. ఓపెన్ కేటగిరీలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను 1 : 50 కాకుండా 1:65 రాస్తున్నారని  ఆరోపించారు.