బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్, సీనియర్ నటి టబు కాంబోలో సినిమా అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు పండగే. తెరపై ఈ జంట పండించే కెమిస్ట్రీని చూసేందుకు ఇష్టపడే అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది ‘ఓరోన్ మే కహన్ దమ్ థా’ టీమ్. అజయ్ కలిసి నటించిన తాజా చిత్రమే ‘ఓరోన్ మే కహన్ దమ్ థా’. 2000 మధ్య కాలంలో సాగే రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల ముందుగా ప్రకటించినట్టు తేదీన కాకుండా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 5న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించిన మేకర్స్ రిలీజ్ డేట్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఫ్రైడే ఫిల్మ్ వర్క్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
“ప్రియమైన స్నేహితులారా.. ఎగ్జిబిటర్లు, పంపిణీ దారుల అభ్యర్థన మేరకు మేము మా చిత్రం ‘ఓరోన్ మే కహన్ దమ్ థా’ విడుదల తేదీని మార్చాలని సమష్టిగా నిర్ణయించుకున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నది. నీరజ్ పాండే కథను అందిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్హెచ్ స్టూడియోస్ సమర్పణలో ఎన్హెచ్ స్టూడియోస్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, పనోరమా స్టూడియో పతాకాలపై తెరకెక్కుతోంది. నరేంద్ర హీరావత్, కుమార్ మంగత్ పాఠక్, సంగీత అహీర్, శీతల్ భాటియా నిర్మిస్తున్నారు. దీంట్లో శాంతను మహేశ్వరి, జిమ్మీ, షేర్గిల్, బెనెడిక్ట్ గర్రెట్, సయీ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇటీవలే ‘కిసీ రోజ్’ అనే ఓ రొమాంటిక్ మెలోడీని కూడా మేకర్స్ సంగీత ప్రపంచంలోకి వదిలిన సంగతి తెలిసిందే.