14-03-2025 12:00:00 AM
ఏఐఎన్యూ ఎండీ డాక్టర్ సీ మల్లికార్జున
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ శిబిరాలు నిర్వహించి, 10 వేలమందికి పరీక్షలు నిర్వహించినట్టు హాస్పిటల్ ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సీ మల్లికార్జున తెలిపారు.
ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా నగరంలోని ఎర్రమంజిల్లో ఉన్న హాస్పిటల్లో గురువారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ నరేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి, సీఈవో సందీప్ గూడూరుతో కలిసి డాక్టర్ సీ మల్లికార్జున ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ.. బీపీ, మూత్రంలో ప్రోటీన్, సీరం క్రియాటినైన్.. ఈ మూడు చిన్నపాటి పరీక్షలతోనే కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నెలరోజుల పాటు తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించామని గుర్తుచేశారు.
అవసరమైతే భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. కిడ్నీ వ్యాధులను త్వరగా గుర్తించి నయం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.