calender_icon.png 11 October, 2024 | 6:51 AM

న్యాయవాదులు ప్రతిపక్ష పాత్ర పోషించాలి

11-10-2024 02:09:23 AM

న్యాయ వ్యవస్థ ముందు అందరూ సమానమే 

రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌మును సింఘ్వి

టీ పీసీసీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో సన్మానం 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : న్యాయవాదులు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుందని రాజ్యసభ సభ్యుడు  అభిషేక్ మను సింఘ్వి అన్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ ప్రతినిధులు గురువారం బేగంపేట లోని హరితప్లాజాలో అభిషేక్ మనుసింఘ్విని సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం న్యాయవాదులు అధికారం ఎటుంటే అటువైపే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పీఎంఎల్‌ఏ కేసులో కవిత అరెస్టు అంశాన్ని ప్రస్తావిస్తూ.. విచారణ పూర్తయ్యాకనే అరెస్టు చేశారని తెలిపారు. కవిత,  కేజ్రీవాల్  కేసు విచారణ వేరని పేర్కొన్నారు. మహిళలకు లీగల్‌సెల్ తరఫు నుంచి భరోసా కల్పించాలన్నారు.

హైదరాబాదే కాకుండా  అన్ని జిల్లాలలో కాంగ్రెస్ లీగల్‌సెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్  మాట్లాడుతూ.. టీ పీసీసీ లీగల్‌సెల్ కమిటీకి టీ పీసీసీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. 

న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్, ఇళ్ల స్థలాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. హైకోర్టు కొత్త భవనం సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. 

సింఘ్వీని రాజ్యసభకు పంపడం చారిత్రక అవసరం: డిప్యూటీ సీఎం

అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రక అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొనారు. గురువారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన కార్యక్రమానికి భట్టి ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడు తూ దేశంలోనే నిష్ణాతులైన అతికొద్ది మంది న్యాయవాదుల్లో సింఘ్వీ ఒకరన్నారు. తెలంగాణ ప్రజల గళాన్ని పెద్దల సభలో ఆయన వినిపించనున్నారని వివరించారు.