14-04-2025 12:41:41 AM
-న్యాయవాదులకు ఎంపీ రఘురామిరెడ్డి హామి
ఖమ్మం, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అడ్వకేట్ప్రొటక్షన్ (అమెండమెంట్) బిల్లుపై చర్చ లేవనెత్తుతానని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామిరెడ్డి న్యాయవాదులకు హామి ఇచ్చారు.
బిల్లు ను సవరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ నేతృత్వంలో ఆదివారం రాత్రి ఖమ్మంలో ఎంపిని కలిసి, వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించి, ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
న్యాయవాది చట్టం బిల్లులో ఉన్న లోపాలను సరిచేసి, న్యాయవాదులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. 2021లో సుమారు 1900 మంది న్యాయవాదులు నోటరీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు ఇంటర్వ్యూలకు పిలవలేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్ళారు. 41 సీఆర్పీసి సెక్షన్కు సంబంధించి అరనేష్ కుమార్ జడ్జిమెంట్ను సవరించి, బాధితుల హక్కులను కాపాడే విధంగా లోక్ సభలో చర్చించాలని వినతిపత్రంలో కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంపీని కలిసిన వారిలో సీనియర్ న్యాయవాది పసుపులేటి శ్రీనివాస్ ఉన్నారు.