- సువిశాల ప్రాంగణం, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు
- 6 వేల మందికి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి) : అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్లు తయారు చేయించింది. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట సమీపంలో దాదాపు 57ఎకరాల విస్తీర్ణంలోని యూనివర్సిటీ స్థలంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తో పాటు అకడమిక్ బ్లాక్, వర్క్షాపులు, గర్ల్స్, బాయ్స్ బిల్డింగ్లు, డైనింగ్ హాల్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
వీటితోపాటు ఆడిటోరియం, లైబ్రరీ, సువిశాల మైదానం, పార్కింగ్ ఏరియా ఉండేలా ఈ డిజైన్లు రూపొందించారు. సువిశాల ప్రాంగణంలో ఎక్కువ ఖాళీ స్థలం, గ్రీనరీ ఉండేలా భవన నమూనాలు తయారు చేయించారు. ఆరు వేల మంది విద్యార్థుల నైపుణ్య శిక్షణ, వసతి సదుపాయాలు ఉండేలా క్యాంపస్లో నిర్మాణాలను చేపట్టనుంది.
అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చనున్నారు. వీటితోపాటు విద్యుత్ వినియోగం తగ్గించేలా ఏసీల వాడకం లేకుండా కొన్ని భవనాల్లో గాలి వెలుతురు ఉండేలా అధునాతన డిజైన్లలో వర్క్షాపులు, అకడమిక్ బిల్డింగ్లు నిర్మిస్తారు. ప్రపంచస్థాయి మౌ లిక సదుపాయాలుండేలా యూనివర్సిటీ క్యాంపస్ను దేశమందరి దృష్టిని ఆకర్షించేలా నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆర్కిటెక్ట్ ఇంజినీర్లకు, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మెఘా కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
నవంబర్ 6న పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎనిమిది నుంచి పది నెలల్లోగా ఈ భవనాల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి మెఘా కంపెనీ ఇటీవలే రూ.200 కోట్లు విరాళం అందించింది. తమ ఇంజినీరింగ్ నైపుణ్యంతో క్యాంపస్ను అధునాతనంగా నిర్మించేందుకు ముందుకు వచ్చింది.
ఇటీవలే అదానీ కంపెనీ స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు విరాళం అందించింది. వీటితోపాటు వివిధ కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం, విరాళాల ద్వారా సమీకరించిన నిధులన్నీ కార్పస్ ఫండ్ జమ చేస్తోంది. వీటితో యూనివర్సిటీ నిర్వహణకు భవిష్యత్లో ఆర్థికపరమైన ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.