14-02-2025 12:00:00 AM
కరీంనగర్ సిటీ, ఫిబ్రవరి13: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహ నుండి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం కలెక్టరేట్లో దత్తత ఉత్తర్వులు అందజేశారు. శిశు గృహ నుండి ఐదుగురు మగ శిశువులను, నలుగురు ఆడ శిశువులను వరంగల్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు.
వీరందరికీ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దత్తత ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతు లు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. ఇందుకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం భగత్ నగర్ కరీంనగర్ లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కర్ర సబిత, డిసిపిఓ పర్వీన్, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, పిఓ తిరుపతి, శిశు గృహ మేనేజర్ తేజస్వి, సోషల్ వర్కర్ రాజేష్, రమాదేవి పాల్గొన్నారు.