17-12-2024 02:04:01 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సమాజ అభివృద్ధిలో భాగంగా ఓపెన్టెక్స్ ఇండియా, ప్రముఖ సమాచార నిర్వహణ సంస్థ నిర్మాణ్ ఆర్గనైజేషన్తో కలిసి ‘వన్ కార్పొరేట్ - వన్ విలేజ్’ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలోని 4 గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేయనున్నది.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి నిర్మాణ్ ఆర్గనైజేషన్ గిరిజన పల్లెలను మోడల్ గ్రామాలుగా మార్చే లక్ష్యంగా పనిచేస్తున్నది. ములుగు జిల్లాలోని చంద్రు తండా, ఎల్బీనగర్, కోడిశాలకుంట, జగన్నపేట గ్రామాల అభివృద్ధికి రూ. కోటి వ్యయంతో అంగనవాడీ భవనాలు, నీటి ట్యాంకులు, బోర్లు, సౌర విద్యుత్ దీపాల వ్యవస్థ, విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, పాఠశాల మరమ్మతులు, ఆరోగ్య శిబిరాలు వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటి ద్వారా 5 వేల మంది ప్రజలకు లబ్ధి చేకూరనున్నది.