calender_icon.png 25 September, 2024 | 7:53 PM

ఐఎంజీబీ భూములపై తీర్పు వాయిదా

06-09-2024 12:36:56 AM

హైదరాబాద్, సెప్టెంబర్ ౫(విజయక్రాంతి): క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భరత అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఉమ్మడి ఏపీలో 2003లో అప్పటి సీఎం నారా చంద్రబాబు 855 ఎకరాల భూములు, పలు స్టేడియాలను ఇవ్వడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. భూకేటాయింపుల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది.

ఐఎంజీ భారత అకడమీస్ ఎండీ బిల్లీ రావు తరపు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ.. ఉమ్మడి ఏపీలో జరిగిన వ్యవహారంపై ఇప్పుడు దర్యాప్తు అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన భూముల్ని చంద్రబాబు తన వాళ్లకు క్రీడల అభివృద్ధి పేరుతో కట్టబెట్టిన భూబాగోతంపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల వాదన.