calender_icon.png 19 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్బస్థ శిశువు, లింగ నిర్ధారణ చేసి అబార్షన్ లు చేస్తున్నారని ఆదిత్య నర్సింగ్ హోమ్ ఆసుపత్రి సీజ్

18-03-2025 07:17:53 PM

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి అన్నా ప్రసన్న కుమారి..

పెద్దపల్లి (విజయక్రాంతి): ధర్మారంలోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్ లో గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్ లు చేస్తున్నారనే సమాచారం మేరకు ఆస్పత్రి మంగళవారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి అన్నా ప్రసన్న కుమారి తెలిపారు. ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారితో పాటు డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నర్సింగ్ హోమ్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పి.సి.పి.ఎన్.డి.టి యాక్ట్ (గర్భస్థ శిశువు లింగ ఎంపిక నిషేధిత చట్టం) నిబంధనలు సరిగా పాటించడం లేదని, ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ ల రిజిస్ట్రేషన్ లను సస్పెండ్ చేసి, స్కానింగ్ మిషిన్, ఆసుపత్రిని సీజ్ చేశామని జిల్లా వైద్యాధికారి తెలిపారు. 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేశామని, ఈ నర్సింగ్ హోమ్ కు 9 బెడ్స్ తో నడుపుటకు అనుమతి ఉండగా 25 కంటే ఎక్కువ బెడ్స్ తో నడుపుతున్నారని, ఈ ఆస్పత్రిలో పునర్నిర్మాణ పనులు అనగా సివిల్ వర్క్స్ నడుస్తుండగా అదే అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, కనీస పేషెంట్ భద్రత కూడా తీసుకోవడం లేదని, సరిగా బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ చేయడం లేదు, ఈ ఆస్పత్రిలో చట్ట ప్రకారం రెండు సంవత్సరముల వరకు గర్భిణీలకు స్కానింగ్ చేసిన వివరాలను జాగ్రత్త పరచవలసి ఉండగా అలా చేయడం లేదని, డా. లావణ్య, గైనకాలాజిస్ట్ మాత్రమే స్కానింగ్ చేసే అర్హత ఉండగా వారితో పాటు అర్హత లేకున్నా డా. శ్రీనివాస్ ఎం.బి.బి.ఎస్. కూడా స్కానింగ్ చేస్తున్నాడని డా. లావణ్య వైద్య, ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగని, వీరికి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేయుటకు అర్హత లేదని, స్కానింగ్ రికార్డులకు, ఫామ్–ఎఫ్ లకు, ఒ.పి. రిజిష్టర్ లో ఉన్న వివరాలకు పొంతన కలవడం లేదన్నారు.

ఇలాంటివి గర్బస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్ లను నిర్వహించుచున్నారని, సమాచారం ఉందని, అనుమతి లేని డాక్టర్ లు కన్సల్టేంట్ గా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారని, ఈ ఆసుపత్రికి గతంలోను నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ సరి చేసుకోకుండా అలానే కొనసాగిస్తున్నారి, ఇలా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నర్సింగ్ హోమ్ రిజిస్ట్రేషన్ ను సస్పెండ్ చేసి సీజ్ చేశామన్నారు. ప్రైవేట్ దావఖానలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే ఆసుపత్రులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. ఈ కార్యక్రమములో స్థానిక పోలీస్ లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.