17-02-2025 11:03:29 PM
మతిస్థిమితం సరిగాలేని వ్యక్తిని మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి తరలింపు..
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): మతిస్థిమితం సరిగాలేని వ్యక్తిని ఆదిభట్ల పొలీసులు చేరదీసి మానవత్వాన్ని చాటుకున్నారు. మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసి ఆశ్రమానికి తరలించారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ సమీపంలో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి నిర్మానుష్య ప్రాంతంలో గత మూడు, నాలుగు రోజులుగా మాసిన బట్టలు, కాలికి గాయంతో దుర్భరమైన స్థితిలో తిరుగుతుండగా గమనించిన స్థానికులు మాతృదేవోభవ అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు గట్టు గిరికి సమాచారం అందించారు. వారి టీంతో కలిసి అక్కడికి వెళ్లి ఆ వ్యక్తి వివరాలు అడగగా పొంతనలేని సమాధానం చెబుతున్నాడు.
దీంతో అతని పరిస్థితిని గమనించిన ఆదిభట్ల ఎస్సై వెంకటేష్ సమక్షమంలో ఆ వ్యక్తిని చేరదీశారు. ఈ సందర్భంగా ఎస్.ఐ వెంకటేష్ మాట్లాడుతూ.. మతిస్థిమితం సరిగ్గా లేని అభాగ్యులను చేరదీసి వారికి అన్నిరకాల వసతి, మానసిక వైద్యాన్ని అందించి మాములు మనుషులుగా మార్చి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చుతున్న గట్టు గిరి సేవాలను కొనియాడారు. వారు చేసే సేవా కార్యక్రమాలకు రాచకొండ పోలీస్ కమీషనరేట్, ఆదిబట్ల పోలీస్ తరుపున ఎల్లవేళలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.