calender_icon.png 27 October, 2024 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటాపై కార్యాచరణ

16-07-2024 12:38:57 AM

  1. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనం చేయండి 
  2. ఇతర రాష్ట్రాల్లో విధానాలను సమగ్రంగా పరిశీలించండి

అసెంబ్లీ సమావేశాలకు ముందే తుది నిర్ణయం తీసుకొందాం 

పంచాయతీ ఎన్నికలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరబాద్, జూలై ౧౫ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచా యతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలపై చర్చిం చారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలపడంతో దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కులగణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసిన వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికా రులు వివరించారు. 2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన జనగణన ఫార్మాట్ 53 కాలమ్స్‌తో ఉందని, దానికి మరో మూడు కాలమ్స్ జోడించి కుల గణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు. 

త్వరలోనే తుది రూపు

బీసీ రిజర్వేషన్ల పెంపుతోపాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉమ్మడి రాష్ర్టం నుంచి మొదలుకొని తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఇప్పటివరకు అనుసరించిన విధానాలపై కాలక్రమ పట్టిక రూపొందించాలని, ఏవైనా సందేహాలు వస్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు.

న్యాయపరమైన విషయాల్లో అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాలని తెలిపారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మారోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని తెలిపారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,  మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మంత్రి కే జానారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.